ఫీలయ్యారా?

16, ఏప్రిల్ 2009, గురువారం

ప్రచారంలో మొనగాళ్ళు!

ప్రచారం ముగిసింది. ఎన్నిక మొదలయింది. ఇప్పుడు ఎస్.ఎం.ఎస్. కూడా వాడడానికి వీల్లేదని కమీషన్ ఆంక్షలు విధించింది. ఏదేమయినా, ఇప్పటి వరకు తెలుగునాట వివిధ మాధ్యమాల ద్వారా జరిగిన ప్రచారంలో ఎవరు ఎక్కువ ప్రజల దృష్టిని ఆకర్షించారు అనేది చూద్దాం.

వార్తా పత్రికలు: తెలుగుదేశం (మానిఫెస్టో ముఖ్యాంశాలు...సూటిగా, సుత్తి లేకుండా), భాజపా (ప్రభుత్వాలని పోల్చి చూపిన విధానం)
రేడియో: కాంగ్రెస్ (జయహో!), లోక్ సత్తా (మూడు కుటుంబాల్ని కాదు, రాష్ట్రాన్ని గెలిపించుకోండి)
ఇంటర్నెట్: భాజపా (వివిధ వెబ్ సైట్లలో లాల్ క్రిష్ణ అద్వాని బ్యానర్స్)
టి. వి. : ప్రజారాజ్యం ("ప్రజారాజ్యం - ఇది ప్రజల రాజ్యం" స్టాలిన్ చిత్ర గీతానికి అనుకరణ అయిన ఉత్తేజభరితంగా ఉంది. ఈ స్థాయి లో ప్రోమోషనల్ విడియో క్లిప్ వేరే పార్టీ అందించలేక పోయింది)
ఎస్. ఎం. ఎస్.: కాంగ్రెస్, తెదేపా
హోర్డింగ్ / OOH: లోక్ సత్తా (AP Needs JP), ప్రజాస్వామ్యం అనే క్షతగాత్రుడిని అంబులెన్స్ లో మోసుకొని వెళ్ళడం
Road show: YSR, NTR, Pawan Kalyan

* వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, హాస్యాస్పదమయిన చేష్ఠలను మినహాయించడమయినది.

14, ఏప్రిల్ 2009, మంగళవారం

ఎన్నికల కలకలం: ఈ రోజు పెళ్ళికి పెద్ద దిక్కు... తర్వాత?

కొన్ని వర్గాల, సమాజాల అభిమతమే మతమై కూర్చుంటుంది. హిందూ మతానికి ప్రేరణగా ఉంటూ వచ్చిన అంశం "సత్యం". సత్యాన్వేషణలో తమ అనుభవాల సారాన్ని ఇతిహాసాలుగా, ఫలితాల్ని వేదాలుగా మన పూర్వికులు మనకందించారు. అలాగే ఇస్లాంకి "ప్రేమ", క్రిస్తయానిటికి "కరుణ" కీలకాంశాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చెప్పుకున్న మతాల వారు వారికి ప్రాతిపదికగా నిలిచిన సున్నితమైన మూలాల్ని ఎలా పూడ్చిపెడుతున్నారో చూస్తూనేవున్నాం!


ఆ పరంపరలోనే ఏర్పడిన కొత్త పునాది నమ్మకం. మనం ఈ కర్మ భూమి పై మనుగడ సాగించాలంటే ఈ నమ్మకమనే దాన్ని మనసా వాచా కర్మణా నమ్మి తీరాలి. ప్రపంచంలో నేపాల్ మాత్రమే హిందూ దేశంగా పరిగణించబడుతుంది. పేరుకే హిందూస్తాన్ అయినా మన "లౌకిక " సిద్ధాంతం ప్రకారం మనదో అయోమయ రాజ్యం. ఈ రాజ్యంలో అఫిషియల్, అనఫిషియల్ వ్యవహారాలన్నీ నమ్మకమనే కొత్త ప్రాతిపదికన నడుస్తున్నాయి. "సత్యాన్ని" వదిలేసి "నమ్మకాన్ని" పట్టుకొని వేళ్ళాడే మరో తంతు "పెళ్లి".


ఇప్పుడు ఈ ఎలెక్షన్ పెళ్లిని సాధ్యమైనంతవరకు సజావుగా , శాస్త్రయుక్తంగా (రాజ్యంగబద్ధంగా) జరిపించటానికి, ఎన్నికల కమీషన్, పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలు, సహకార సంఘాలు, మీడియా సంస్థలు ఇప్పుడు పురోహితులు, పెద్దలు వగైరా ప్రముఖ పాత్రల్ని పోషిస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలు - వాగ్దానాలు, ఎజెండాలు, వోట్లు మొదలైనవి వర్తమానానికి సాక్ష్యులు మాత్రమే! కాపురానికి (భవిష్యత్తుకి) మాత్రం ఎలాంటి హామీ లేదా భరోసా ఇవ్వలేవు. వోటు హక్కు వినియోగించుకోండి అని వోటు వేయనివాడో వింత పశువు అన్న స్థాయిలో ఊదరగొడుతున్నారు. పెళ్లి చేసుకోవడం కూడా ఒక హక్కేనా? పెళ్లి కాస్తా లొల్లి అయితే చెప్పుకునే దిక్కులేనపుడు, ఇప్పుడు పెళ్లిపెద్దల పాత్ర పోషిస్తున్న వారు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నపుడు స్వయంవరానికి అర్థమేముంది?


ప్రతివాడూ తాతల కాలం నాటి రాజ్యాంగాన్ని మార్చాలనే అంటాడు. కానీ మార్చరు. ఎందుకంటే ఇవాళ పెళ్లి చేసుకున్నవాడే రేపు పని చేయాలి!

1, ఏప్రిల్ 2009, బుధవారం

ఎన్నికల కలకలం: వరుణ్ గాంధీ మైనారిటీ అయ్యుంటే?

NSA ద్వారా వరుణ్ ప్రేలాపనలకి శిక్ష పడేట్టు చేశారు కాంగ్రెస్ వారు. ఒక మతాన్ని దూషించడం తప్పే, అదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా! అది కోడ్ కి విరుద్ధం. అంతవరకు బాగానే ఉంది.

మైనారిటీల్లో అంత కంటే దారుణంగా మాట్లాడే ప్రబుద్దులున్నారు. వారు ఇటువంటి సమయంలో అదే తరహాలో మాట్లాడితే, వరుణ్ పై ప్రయోగించిన చట్టాన్ని అమలు చేయగలిగే దమ్ము మన వారికి ఉందా అనేది అనుమానమే.