ఫీలయ్యారా?

20, మే 2009, బుధవారం

దేశం నాగలికి పని చెప్పలేదు, విత్తనాల నాణ్యత చూడలేదు

కానీ నెల రోజుల తర్వాత మొలకలు చూడాలని ఆశించింది! అడపా దడపా ఉద్యమాలు మినహా పార్టీని పరిపుష్టం చేయడానికి క్షేత్ర స్థాయిలో కసరత్తు నాలుగేళ్ళు శూన్యం. విత్తనాలు చూడబోతే పాతబడి నాసి రకంగా మారాయి. వాటికి నీరు పోసి, పదును లేని భూమిలో విత్తి, అనువైన వాతావరణం కోసం ప్రార్ధించి, నెలరోజుల తర్వాత ఫలితం చూడలనుకున్నారు పెద్దలు.

నేల సరి లేక పోయినా, విత్తనం వేసే ముందు నీళ్ళలో వేస్తే దాని పసేమిటో తెలిసిపోయేది. 2004 లో బొటాబొటీ మెజారిటీ వచ్చిన విత్తనాలు ఎప్పుడు చూసినా పార్టీ కార్యాలయాన్ని అంటి పెట్టుకుని ఉండేవి. లోలోపల ఉడికి పోయి పస లేకుండా తయారయిన వీటిని మొలకల కోసం వాడలనుకోవడం ఎంత అవివేకం. "నేల సంగతి సరే, విత్తనమయితే మన కళ్ళముందే నిగ నిగ లాడుతూ వుంది... కొద్దో గొప్పో వాతావరణం కూడా అనుకూలంగానే వుంది కదా" అనుకున్నారు.

ఇంకేం, 16వ తేదీన మొలకలన్నిటినీ జనాలకి చూపించి మెప్పిద్దామానుకున్నారు. కానీ ఈ స్పెషల్ గ్రేడ్ విత్తనాలు, సాధారణ వ్యవసాయక పరిస్థితుల్లో మొలకేత్తలేవు. వాటికి అసాధారణ అనుకూలత అవసరం. బోటనీ, థియరీ, రిపోర్టులు మొదలైన వాటిని వదలి, మన చేతిలో లేని వాతావరణ పరిస్థితుల కోసం ప్రార్థించే కన్నా, మన నేల సరి చేసుకుని, విత్తనాల్ని పరీక్షించుకోవడం తెలివైన పనేమో!

*చూసి రమ్మంటే కాల్చి వచ్చే కొడాలి నాని లాంటి యువ నేతల్ని వదిలి, కాల్చి రమ్మంటే చూట్టనికే వేరే వాళ్ళని పంపి, తర్వాత వాకబు చేసే సో కాల్డ్ సీనియర్ లీడర్లతో ఎంత వరకు ప్రయోజనం?

పైనా, కిందా, అటుపక్క, ఇటుపక్క... ఈ రచ్చంతా కాంగ్రెస్ పుణ్యమే

ఈ దేశం వాళ్ళ బాబు గాడి సొమ్ము అన్నట్టు ప్రత్యేక దేశాలు ఉదారంగా కట్టబెడతారు. ముష్టి అందుకున్న వాళ్ల తోటే మనకి తలనొప్పి తెచ్చి పెడతారు. తాతల నుంచి మనవళ్ళ దాక ఈ వంశ పారంపర్య పాలనలో మన దేశానికి అన్ని పక్కల నుంచి ముప్పు వుండేలా వ్యవస్థని తీర్చి దిద్దారు కాంగ్రెస్ నాయకులు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, సియాచిన్ వగైరా మూకలన్నీ వీళ్ళ పుణ్యమే. శాంతి అనేది వీళ్ళ డిక్షనరీ లోనే లేదు. అశాంతి కి ఆజ్యం పోస్తారు. ఏదో ఒక రోజు దానికే బలవుతారు. దాన్ని అణిచే ప్రయత్నంలో మళ్ళీ అల్లర్లని చవి చూస్తారు.

అధిక సంఖ్యలో వున్నతమిళుల పక్షాన పోరాడుతున్న LTTE పైకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపి శ్రీలంక ప్రభుత్వానికి మద్ధతు నిచ్చారు రాజీవ్ గాంధీ. ఒక పక్క చర్చలు జరుపుతూనే, రా పాత్ర వుండగానే, ఈ దారి ఎందుకు ఎంచుకున్నారనేది ఎవరికీ అర్ధం కాలేదు. పీస్ కీపింగ్ ఫోర్స్ ఆగడాలకు బలయిన వారి వివరాలను ప్రచురించింది LTTE. ఆ ఫోర్స్ లో తోటి తమిళుల పై పోరుకు సిద్ధమైన తమిళ సైనికుల బాధ వర్ణనాతీతం. ఇంత జరిగినా బల ప్రయోగం చేయకుండానే శాంతి భద్రతలను నెలకొల్పిందన్నరాజీవ్ గాంధీ మాటలను వారు ఏ విధంగా అర్ధం చేసుకుని వుంటారో ఊహించవచ్చు.

తాతలు తెచ్చి పెట్టిన తలనొప్పులకు మందు రాసుకోలేని ఆ ప్రభుత్వం చివరికి ఆ యువ నాయకుడినే అసంతృప్తికి బలి ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలయ్యేంతవరకు ప్రభాకరన్ మా మిత్రుడు... లాంటి మాటల్ని కరుణానిధి చే పలికించి, ఫలితాల సమయంలో పులి ని మట్టు బెట్టింది. LTTE ఒక జాతి అసంతృప్తి నుంచి పుట్టింది. దానికి పరిష్కారం రాజకీయంగానే వెతకాల్సింది. బలవంతపు దాడుల వల్ల నష్ట పోయేది మన దేశమే. మన నాయకుల చరిత్రాత్మక, వ్యూహత్మక తప్పిదాలకు నాయకుల తో పాటు, సామాన్య ప్రజలు కూడా బలవుతూనే వున్నారు.

19, మే 2009, మంగళవారం

ఎల్లలు దాటనున్న జలయజ్ఞం?

లోక్ సభ ఎన్నికల్లో విజయభేరి మ్రోగించి, పార్లమెంట్ లో తనదైన ముద్ర వేయనున్న వై యస్ ఆర్ ఇప్పుడు తన ప్రాజెక్టుల పర్వాన్ని దేశమంతా కొనసాగించనున్నారని భోగట్టా. అదే జరిగితే జల వనరుల పై ఆంధ్ర ప్రభుత్వానిది పై చేయి అవుతుంది. కేంద్ర మంత్రి వర్గంలో ఇరిగేషన్ శాఖని తన ముఖ్యుల్లో ఒకరికి ఇప్పించడం ద్వారా ఆయన ఈ ప్రణాళికను నిజం చేసుకోనున్నారని తెలిసింది. నదుల అనుసంధానం కూడా ఈ బృహత్ప్రణాళికలో భాగం కావచ్చు.

18, మే 2009, సోమవారం

నాయకులు తయారవుతారు, కథానాయకులు సృష్టించబడతారు!

ఈ లాజిక్ మన ప్రజలకు అర్ధమయింది కానీ పార్టీలకు ఇంకా అర్థంకావట్లేదు. ప్రజల కష్టనష్టాలు నాయకుల్ని ప్రేరేపిస్తాయి. వాటిని అదిగమించడానికి చేసే ప్రయత్నం నాయకుణ్ణి తయారుచేస్తుంది. కథానాయకులు రాత్రికి రాత్రి సృష్టించబడతారు. వారు జనంలో తిరగరు, జనంలోంచి పుట్టరు. చెత్త కథానాయక పాత్రల ఎంపికతో జనాలకి చుక్కలు చూపిస్తున్న మన హీరోలు ఏకంగా నాయకుల పాత్రలే పోషిస్తామంటూ జనాల్లోకి వచ్చారు. అడ్రస్ లేకుండా పోయారు. నాయకులు కావాలంటే రథాలు దిగి జనాల్లో కలవండి. జనంతో తిరగండి. కథానాయకుడికి నాయకుడికి మధ్య అంతరాన్ని చెడిపేసి, సాధారణ వ్యక్తిలా ఆలోచించి అసాధారణంగా ఎదిగిన ఎన్టీఆర్ ఫార్ములాలో ఈ చిన్న ఎలిమెంట్ ని మన తొడలు కొట్టే, మీసాలు తిప్పే హీరోలు మిస్ అవుతున్నారు.

తెదేపా తెలంగాణా నాయకులకే ఈ ఓటమి అంకితం!

దేవేందర్ గౌడ్ బాబు పై తెచ్చిన ఒత్తిడి, తదనంతర పరిణామాలు పార్టీ పుట్టి ముంచాయి. మేము మా ప్రజలకు, కేసీఆర్ కు దీటయిన సమాధానం ప్రత్యేక తెలంగాణా పై ఇవ్వాలని, దాని పై తెదేపా వైఖరి స్పష్టం చేయకుండా ఎన్నికలకు వెళ్ళలేమని కోరి కేసీఆర్ తో తల గోక్కున్నారు. వాదన లేవనెత్తిన గౌడ్, పెద్దిరెడ్డి, కడియం, ఎర్రబెల్లి తదితరులు చంద్రబాబుని స్థిమితంగా ఉండనివ్వలేదు. తెలంగాణ తమ్ముళ్ళ అసమ్మతి తలనొప్పి భరించడం ఎందుకని కూటమిని ఆవిష్కరించారు బాబు గారు. అక్కడ ఆంధ్రా సెంటిమెంట్ బాగా పని చేసి, మిత్రుణ్ణి (తెరాసని) చూసి తెదేపాకి వాత పెట్టారు కోస్తా వోటర్లు.

కొసమెరుపేమిటంటే ఎర్రబెల్లి మినహా వైఖరి స్పష్టం చేయాలని మంకు పట్టు పట్టిన నేతలు అపజయం పాలయ్యారు. బాబు తనుచేయలనుకున్నది తాను చేసినంతకాలం అంతా సవ్యంగా నడిచింది. ఇకనైనా ఇంటిపెద్దని తనే అని గుర్తించి మసలు కోవడం మేలు, లేక పొతే పార్టీ అధ్యక్ష పదివికి తమ్ముళ్లే ఎసరు పెట్టగలరు!

16, ఏప్రిల్ 2009, గురువారం

ప్రచారంలో మొనగాళ్ళు!

ప్రచారం ముగిసింది. ఎన్నిక మొదలయింది. ఇప్పుడు ఎస్.ఎం.ఎస్. కూడా వాడడానికి వీల్లేదని కమీషన్ ఆంక్షలు విధించింది. ఏదేమయినా, ఇప్పటి వరకు తెలుగునాట వివిధ మాధ్యమాల ద్వారా జరిగిన ప్రచారంలో ఎవరు ఎక్కువ ప్రజల దృష్టిని ఆకర్షించారు అనేది చూద్దాం.

వార్తా పత్రికలు: తెలుగుదేశం (మానిఫెస్టో ముఖ్యాంశాలు...సూటిగా, సుత్తి లేకుండా), భాజపా (ప్రభుత్వాలని పోల్చి చూపిన విధానం)
రేడియో: కాంగ్రెస్ (జయహో!), లోక్ సత్తా (మూడు కుటుంబాల్ని కాదు, రాష్ట్రాన్ని గెలిపించుకోండి)
ఇంటర్నెట్: భాజపా (వివిధ వెబ్ సైట్లలో లాల్ క్రిష్ణ అద్వాని బ్యానర్స్)
టి. వి. : ప్రజారాజ్యం ("ప్రజారాజ్యం - ఇది ప్రజల రాజ్యం" స్టాలిన్ చిత్ర గీతానికి అనుకరణ అయిన ఉత్తేజభరితంగా ఉంది. ఈ స్థాయి లో ప్రోమోషనల్ విడియో క్లిప్ వేరే పార్టీ అందించలేక పోయింది)
ఎస్. ఎం. ఎస్.: కాంగ్రెస్, తెదేపా
హోర్డింగ్ / OOH: లోక్ సత్తా (AP Needs JP), ప్రజాస్వామ్యం అనే క్షతగాత్రుడిని అంబులెన్స్ లో మోసుకొని వెళ్ళడం
Road show: YSR, NTR, Pawan Kalyan

* వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, హాస్యాస్పదమయిన చేష్ఠలను మినహాయించడమయినది.

14, ఏప్రిల్ 2009, మంగళవారం

ఎన్నికల కలకలం: ఈ రోజు పెళ్ళికి పెద్ద దిక్కు... తర్వాత?

కొన్ని వర్గాల, సమాజాల అభిమతమే మతమై కూర్చుంటుంది. హిందూ మతానికి ప్రేరణగా ఉంటూ వచ్చిన అంశం "సత్యం". సత్యాన్వేషణలో తమ అనుభవాల సారాన్ని ఇతిహాసాలుగా, ఫలితాల్ని వేదాలుగా మన పూర్వికులు మనకందించారు. అలాగే ఇస్లాంకి "ప్రేమ", క్రిస్తయానిటికి "కరుణ" కీలకాంశాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చెప్పుకున్న మతాల వారు వారికి ప్రాతిపదికగా నిలిచిన సున్నితమైన మూలాల్ని ఎలా పూడ్చిపెడుతున్నారో చూస్తూనేవున్నాం!


ఆ పరంపరలోనే ఏర్పడిన కొత్త పునాది నమ్మకం. మనం ఈ కర్మ భూమి పై మనుగడ సాగించాలంటే ఈ నమ్మకమనే దాన్ని మనసా వాచా కర్మణా నమ్మి తీరాలి. ప్రపంచంలో నేపాల్ మాత్రమే హిందూ దేశంగా పరిగణించబడుతుంది. పేరుకే హిందూస్తాన్ అయినా మన "లౌకిక " సిద్ధాంతం ప్రకారం మనదో అయోమయ రాజ్యం. ఈ రాజ్యంలో అఫిషియల్, అనఫిషియల్ వ్యవహారాలన్నీ నమ్మకమనే కొత్త ప్రాతిపదికన నడుస్తున్నాయి. "సత్యాన్ని" వదిలేసి "నమ్మకాన్ని" పట్టుకొని వేళ్ళాడే మరో తంతు "పెళ్లి".


ఇప్పుడు ఈ ఎలెక్షన్ పెళ్లిని సాధ్యమైనంతవరకు సజావుగా , శాస్త్రయుక్తంగా (రాజ్యంగబద్ధంగా) జరిపించటానికి, ఎన్నికల కమీషన్, పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలు, సహకార సంఘాలు, మీడియా సంస్థలు ఇప్పుడు పురోహితులు, పెద్దలు వగైరా ప్రముఖ పాత్రల్ని పోషిస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలు - వాగ్దానాలు, ఎజెండాలు, వోట్లు మొదలైనవి వర్తమానానికి సాక్ష్యులు మాత్రమే! కాపురానికి (భవిష్యత్తుకి) మాత్రం ఎలాంటి హామీ లేదా భరోసా ఇవ్వలేవు. వోటు హక్కు వినియోగించుకోండి అని వోటు వేయనివాడో వింత పశువు అన్న స్థాయిలో ఊదరగొడుతున్నారు. పెళ్లి చేసుకోవడం కూడా ఒక హక్కేనా? పెళ్లి కాస్తా లొల్లి అయితే చెప్పుకునే దిక్కులేనపుడు, ఇప్పుడు పెళ్లిపెద్దల పాత్ర పోషిస్తున్న వారు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నపుడు స్వయంవరానికి అర్థమేముంది?


ప్రతివాడూ తాతల కాలం నాటి రాజ్యాంగాన్ని మార్చాలనే అంటాడు. కానీ మార్చరు. ఎందుకంటే ఇవాళ పెళ్లి చేసుకున్నవాడే రేపు పని చేయాలి!

1, ఏప్రిల్ 2009, బుధవారం

ఎన్నికల కలకలం: వరుణ్ గాంధీ మైనారిటీ అయ్యుంటే?

NSA ద్వారా వరుణ్ ప్రేలాపనలకి శిక్ష పడేట్టు చేశారు కాంగ్రెస్ వారు. ఒక మతాన్ని దూషించడం తప్పే, అదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా! అది కోడ్ కి విరుద్ధం. అంతవరకు బాగానే ఉంది.

మైనారిటీల్లో అంత కంటే దారుణంగా మాట్లాడే ప్రబుద్దులున్నారు. వారు ఇటువంటి సమయంలో అదే తరహాలో మాట్లాడితే, వరుణ్ పై ప్రయోగించిన చట్టాన్ని అమలు చేయగలిగే దమ్ము మన వారికి ఉందా అనేది అనుమానమే.

20, మార్చి 2009, శుక్రవారం

పార్టీ ఏదయినా, నాయకుడెవరైనా తప్పని "తారక" మంత్రం

ఒకటీ అరా పార్టీలు తప్ప అన్ని ప్రముఖ పార్టీలు, అధికారులు, సామాన్య ప్రజానీకం ఒక వ్యక్తిని మాత్రం ఈ ఎన్నికల సందర్భంగా బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఆయనే దివంగత ముఖ్యమంత్రి, తెలుగునాట సంచలనం నందమూరి తారక రామారావు. పలు రంగాల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది మరి.

రెండు రూపాయలకి కిలో బియ్యం ఇప్పుడు కాంగ్రెస్ వారి పాచిక అయ్యింది. ఇక ప్రజారాజ్యం ఆయన్ని తరచు గుర్తు చేసుకుంటోంది. రామారావు తీసుకు వచ్చిన రాజకీయ ఒరవడిని తామూ ఇప్పుడు సృష్టించగలమని, ఆయన మాదిరిగా అన్ని వర్గాలకి ఆధిపత్యాన్నీకట్టబెట్టి, డిల్లీ పెత్తనాన్ని సవాలు చేయగలమని వారంటున్నారు. ఇక దేశం వారు వేషధారణతో సహా ఆయన్ని అనుకరిస్తున్నారు. ఇక రెబల్స్ సంగతి చెప్పక్కర్లేదు.

ప్రజలతో మమేకమయి, తమ ప్రాంతం వారికి ఒక అస్థిత్వాన్ని చేకూరిస్తే ఏ నాయకుణ్ణయినా అలాగే గుర్తుపెట్టుకుంటారు.

ఇంతకీ నిశ్శబ్ద విప్లవం ఎవరిది?

ఈ మధ్య ఓ మితృడన్నాడు... ఫుల్ సౌండ్ తో, వాద ప్రతివాదనల తో వేదికల పై గోల చేస్తున్న ప్రరాపాది నిశ్శబ్ద విప్లవం ఎలా అవుతుంది? ఆ పదం లోక్ సత్తా కి సరిపోతుందేమో అని. కొత్త నియోజకవర్గం కూకట్ పల్లిలో అతని విజయం ఖరారయినట్టే. అక్కడ విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాస్త ఎక్కువ. ముఖ్యం గా ప్రాంతీయాభిమానం, కులాభిమానం మరీ ఎక్కువ.

ఇక ఆయన ప్రచార శైలి చూస్తే ఒబామాని అనుకరించినట్టే ఉంది. పిల్లల భవిష్యత్తుకు హామీ, మార్పు వగైరా అంశాల నుంచి, వీడియో క్లిప్పుల్లో బ్యాక్ డ్రాప్, రైలు ప్రయాణం వంటివి బాగానే అనుకరించబడుతున్నాయి. గతంలో ఆయన సాధించిన స్కోరు చూస్తే నిశ్శబ్ద విప్లవం అనే మాట లోక్ సత్తాకి సరిపోతుందేమో!

షబ్బీర్ అలీని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు!

ఇంట ఓడి రచ్చ గెలిచిన నాయకులేందరో ఉన్నారు. ప్రజల మనుషుల కుటుంబాల్లో సంబంధాలు అంతకంతకూ అంతరించి పోయి ఏదో ఒక విషయంలో గొడవలు సహజమయిపోతాయి...ఇంటాయన పరిణతితో అవే సర్దుకుంటాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసి వీధిన పడ్డ షబ్బీర్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక "బాబూ ముందు మీ అమ్మకు న్యాయం చేసుకో " అని ఓ ఉచిత సలహా పారేస్తున్నారు.

తానేమి మాట్లాడుతున్నాడో, చేస్తున్నాడో స్పష్టత కలిగి ఉండి పార్టీలకు చెమటలు పట్టిస్తున్న యువకుడికి తన తల్లికి ఎలా న్యాయం చేసుకోవాలో ఎవరైనా చెప్పాలా?

29, జనవరి 2009, గురువారం

పొలిటికల్ "పద్మ"లు: నాడు దర్శకరత్న, నేడు పుత్ర రత్న

సూపర్ స్టార్ కృష్ణ గారికి "పద్మభూషణ్" రావడానికి మేము కృషి చేశామని సుబ్బిరామి రెడ్డి గారంటున్నారు. అప్పట్లో మెగాస్టార్ కి అవార్డు రావడానికి దాసరి కూడా "కృషి" చేశారు. కాని ఇప్పుడు ఆ అవార్డు ఇవ్వడానికి ముఖ్య ప్రేరణ "పోకిరి" మహేష్ బాబు ఇమేజ్. ఓ పెద్ద వోటు బ్యాంకుని కొల్లగొట్టవచ్చన్న ఉద్దేశ్యంతోనే పద్మాలయ స్థల వివాదం ఆగమేఘాల మీద పరిష్కరించేశారు. ఘట్టమనేని కుటుంబాన్ని మంచి చేసుకోవడానికి ఇప్పుడు "పద్మభూషణ్" తాయిలాన్ని ప్రకటించారు. వీరికి ఎప్పుడోనే సదరు అవార్డులు పొందగలిగే అర్హతలు ఉండవచ్చు కానీ, వారు అవి పొందిన సందర్భం మాత్రం గమనార్హం.


ఒకళ్ళ ప్రయోజనాల కోసం మరొకరు సత్కరించుకోండి, సన్మానించుకోండి! కానీ మితిమీరిన ప్రమేయంతో జనాల జేబులకు చిల్లు పెట్టాలని ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుంది. 2005 లో చిరంజీవి సినిమా "జై చిరంజీవ" విడుదల సమయంలో "పద్మ" అవార్డుని ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ రేటుని పెంచేశారు. తదనంతర పరిణామాలకి స్పందించి దాన్ని తగ్గించేశారు.


ఈ మధ్య అక్కినేని నాగార్జున కూడా రేటు పెంచడాన్ని సమర్ధించారు. ఇలాంటి తిక్క పనులతోనే పైరసీ రక్కసిని ఆహ్వానించుకుంటున్నారు. ఆయన కూడా ప్రస్తుత ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తి. ( గత ఎన్నికల సమయంలో లోక్ సత్తా - ఇది మీ సత్తా అని ప్రచారం చేసిన వ్యక్తి).

28, జనవరి 2009, బుధవారం

రైతుని ఆదుకోడానికి రాకెట్ సైన్స్ కావాలా?

అవసరానికి మించి సరఫరా ఉంటే వస్తువు విలువ తగ్గిపోతుంది. అది సహజం. నిలువ ఉండే కాలం కూడా తక్కువ గా ఉండడం వల్ల అసలు విలువే లేకుండా పోతే? పాలు, టమాట వంటి వాటికి అది వర్తిస్తుంది.

రాయల సీమలో ఒక టమాట బోర్డుని (డైరీ వలె) ఏర్పాటు చేసి దానిని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తే, కనీసం మార్కెట్ పోకడలైనా తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ ప్రభుత్వ బోర్డు స్పందించే అవకాశం వుంటుంది.

ప్రస్తుత సరఫరా ఈవిధం గా వుంది: రైతు - కమీషన్ ఏజెంటు - హోల్ సేలర్ (ప్రధమ / ద్వితీయ) - చిల్లర వ్యాపారి - వినియోగదారుడు


బోర్డు ద్వారా రైతుని సత్వరం చిల్లర వ్యాపారికి లేదా పెద్ద వినియోగదారునికి అనుసంధానిచే వీలు దొరుకుతుంది. సరఫరా అధికంగా వున్నా పోటీ ధర లభిస్తుంది లేదా కనీస మద్దతు ధర లభించడానికి అది ఉపయోగపడుతుంది. జ్యూసులు, సాస్ తదితర నిల్వ మార్గాలని అన్వేషించి పెట్టినా అవి అమలు చేయడానికి సమయం పడుతుంది.

సాంకేతికతని, వ్యాపార సూత్రాలని అవసరాన్ని బట్టి అమలు చేయనంతవరకు శ్రమ, డబ్బు వృధా అవుతూనే ఉంటాయి.

27, జనవరి 2009, మంగళవారం

తల్లో జేజమ్మ కనబడింది!

వెండితెరపై అద్భుతం, ప్రపంచ స్థాయి సినిమాలు తీయగలమని మనవాళ్ళూ నిరూపించారు వగైరా మాటలు అరుంధతి సినిమా చూసిన చాల మందే అన్నారు. అయితే ఆ కామెంట్ చిత్రం గురించి కాదు అందులో వాడిన గ్రాఫిక్స్ గురించి. నిజమేననుకుని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అరుంధతిని చూద్దామని ఓ సెలవు రోజు సాయంత్రం బయలుదేరాను.

గొప్ప ప్రమాణాలు అని ముద్దుగా పిలుచుకునేదేది ఆ స్థాయిలో ఉండదని, పై పై హంగులకి మోసపోతామని ఇంతకుముందు ఎన్నో సార్లు అవగతమయింది. కాక పొతే ఆ సాయంత్రం 70 mm పై కనపడింది ... థియేటర్ లోకి వెళ్ళక ముందునుంచే.

అక్కడ సిబ్బందికి ఒంటి మీద యునిఫార్మ్ అయితే ఉంది గాని బుర్రలో ఏముందో, అదే స్థాయిలో తెలివి తేటలున్న ఆ మేనేజిమెంట్ కి, మల్టిప్లెక్స్ ని డిజయిన్ చేసిన వారికే తెలియాలి. ఇప్పటికి పది సార్లు వెళ్ళినా, ఆ రోజు మాత్రం వారి సామర్ధ్యాన్ని "దగ్గర" నుంచి చూసే భాగ్యం కలిగింది.


ఒక షో వదలక ముందే తరువాతి షోకి వచ్చిన వారిని వారి వాహనాల పార్కింగ్ కోసం లోపలికి పంపారు. కిక్కిరిసిపోయిన ఓ మైదానం లాంటి పార్కింగ్ లాట్ మధ్యలో ఉన్న దార్లో అరగంట ఇరుక్కుపోయాను. వెనక్కి వద్దామంటే మన లాంటి వాళ్ళు ఓ ఇరవై కార్లలో గేటు దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. స్ట్రీట్ ఆఫ్ నో రిటర్న్ సినిమా అక్కడే చూపించేసారు. బుక్ మై షో వాడు నాకు ఇంకో షో చూపించాడు. టికెట్ కోసం నా ఫోనే లో ఉన్న మెసేజ్ చూపించాను. Gold M1 అని ఉన్న టికెట్ చూసుకొని లోపలికి వెళ్ళాను. అది సరిగ్గా తెర ముందే వుంది, అదీ పూర్తిగా ఎడమవైపున.
పై నుంచి కింద వరకు ఒకే టికెట్, కాని సౌకర్యంలో మాత్రం కొండంత వ్యత్యాసం. మొట్ట మొదటి సారిగా ఆ వరుసలో వెళ్లి పడ్డాను. వీక్షించడంలో ఒక మంచి అనుభూతి కోసమే అలాంటి చోటికి వెళ్తాము. అందరికీ ఒకే టికెట్ అయినపుడు కింద వాళ్ళకి రిక్లైండ్ సీట్లు ఇవ్వడమో లేదా మరో ఆలోచనో అది డిజైన్ చేసిన వాడికి లేదు. తెర మీద పాత్రలు ఎటు కదులుతుంటే అటు తల, కళ్లు తిప్పుతూ చూడాల్సిందే. అదే గోల్డ్ క్లాస్ మరి.

ఎలాంటి సౌండ్ సిస్టం అయినా మన సినిమా ఆపరేటర్లు యధావిధిగా వాళ్ల నుంచి ఓ స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వాల్యూం పెంచి, తగ్గించి రీరికార్డింగ్ అందాన్ని చిత్రవధ చేసి గూబలదరగోట్టే అదనపు అనుభూతినిచ్చారు. గొప్పగా
చెప్పిన గ్రాఫిక్ కలలు మొదటి అయిదు నిమిషాల్లోనే పటాపంచలయ్యాయి. పాడుబడ్డ కోట మీకు నాటకాల్లో వెనుక కట్టిన తెర మీద బొమ్మలా అనిపిస్తుంది.

దర్శకుడు మాత్రం ఒక సంస్థానానికి (గద్వాల) చెందిన పరిసరాల్లోకి, వాతావరణంలోకి మనల్ని తీసుకు వెళ్ళడంలో కృతకృత్యులయ్యారు. కథ కూడా ఫరవాలేదు. అనుష్కకి వంక పెట్టాల్సిన పని లేదు. మహిళలంతా తమని తము జేజమ్మ (anushka sr) లో చూసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.


మాస్క్, గాడ్జిల, జురాసిక్ పార్క్, మమ్మీ తదితర చిత్రాలు చూసిన వారికి అరుంధతి లోఉన్న ఆనిమేషన్ ఏమిటనేది సులభంగానే అర్థమవుతుంది. వూళ్ళో కరువు, రోగాలు వచ్చిన సన్నివేశంలో కోటని అచ్చంగా ఒక తెర మీద వేసిన బొమ్మలానే చూపిస్తారు. ఇక దయ్యాలు, జుట్టు, గోళ్ళు పెరగడం, చెట్టు వేర్లు మనిషిని చుట్టుకోవడం వగైరాలు వడి వడి గా తిప్పేసారు, గ్రాఫిక్ పనితనం కనబడుతుందనో ఏమో. ఇక పతాక సన్నివేశంలో మీ ముందున్న అరుంధతి, పశుపతిని చంపుతుండగా పాత్రాభినయం, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకదానికొకటి పోటీ పడుతూ దేని మీదా దృష్టి నిలపనివ్వకుండా పిచ్చేక్కిస్తాయి.

అయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , గ్రాఫిక్స్ తదితర ఎఫ్ఫెక్ట్లు ఉన్నాయో లేవో తెలియనంతగా అవి కథనంలో మమేకమయి పోవాలి గానీ అవికూడా ఫలాన విధంగా సీన్లో ఉన్నాయని మనకి అర్థమయి పోతుంటే ఇక వాటిని గొప్పగా వాడారని ఎలా చెప్పగలం? గొప్పగా చూపించారని మాత్రమె చెప్పగలం. సినిమా చూసేసిన వాళ్ళు చెప్పిందీ అదే. కాని మనమే వేరే రకంగా అర్థం చేసుకున్నాము. గ్రాఫిక్స్ ని సాధ్యమయింత భారీగానే వాడారు. అనుమానం లేదు. కథాంశం లేకుండా చూస్తె అత్యున్నత స్థాయిలోనే ఉండవచ్చు కూడా. కాని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కథని ఎలివేట్ చేస్తూ బలాన్ని చేకూర్చాయని చెప్పడం హాస్యాస్పదం.

గొప్పగా చెప్పుకునేవన్నీ గొప్పగా వుండవు - ప్రసాద్స్ లా. అందులోకి వెళితే, మనల్ని ఎలా మభ్యపెడుతున్నరనేది అర్థం చేసుకుంటే, వేరే వాటితో పోల్చిచూస్తే వాటి గొప్పతనమేమిటో తెలుస్తూంది. అది అరుంధతికి కూడా వర్తిస్తుంది.

21, జనవరి 2009, బుధవారం

ఇంట్లో దొంగలు పడితే పోలిసుకి ఫోన్ చేస్తారా, ముఠా నాయకుణ్ణి సంప్రదిస్తారా?

మనింట్లో దొంగలు పడ్డారు. సరదాగా ఒక గదిని ఆక్రమించేశారు. అప్పుడు మనం తెలివిగా దొంగల ముఠా నాయకుణ్ణి సంప్రదించాం! మీ దొంగలని వెనక్కి పిలవండి అని మొరపెట్టుకున్నాం. ఎందుకంటే ఆ దొంగల సామ్రాజ్యం (పాకిస్తాన్) మనం ప్రసాదించిందే. ముఠా నాయకుడు లాయక్ అలీ ఖాన్. వాడు తన ప్రమేయం లేకుండానే వాళ్లు మనింట్లో జొరబడ్డారు, దానికి నేనేమి చేయలేనని తన దొంగ బుద్ధి చూపించాడు. ఇది మన మదటి స్వాతంత్ర దినోత్సవానికి, రిపబ్లిక్ దినోత్సవానికి మధ్య (అక్టోబర్ 1947) జరిగింది.


అప్పటినుంచీ మనింట్లో వాళ్ల అరాచకాలు యదేచ్చగా జరిగిపోతున్నాయి. అది చాలదన్నట్టు ఇంట్లో వాళ్ళని, అతిథుల్ని పొట్టనబెట్టుకుంటున్నారు ( నవంబర్ 2008) . మనం మాత్రం మారలేదు. అలవాటుగా, ఇప్పుడు కూడా ముఠా (కొత్త) నాయకుణ్ణే సంప్రదిస్తున్నాం. మీ దుండగుల్ని మీరే శిక్షించాలి అని వేడుకుంటున్నాం. వాళ్లు కూడా అలవాటుగా మీ ఇంట్లో జొరబడ్డ వాళ్ళకి మాకు సంబంధం లేదు అని మరోసారి బుద్ధి చూపించారు. రోజుకోరకంగా మాట్లాడుతూ సమస్యని నానబెడుతున్నారు. మనకి మళ్ళీ రిపబ్లిక్ వేడుకలు వచ్చేశాయి. మన సార్వభౌమాధికారాన్ని పోగుడుకుంటూ ఆత్మ వంచనతో సంబరాలకి సిద్ధమవుతున్నాం.


గాయపడ్డ అతిథి దేశాల మద్దతుతో వాడింట్లో ప్రవేశించి నక్కివున్న దుండగుల పనిపట్టవచ్చు. వాడు మొండికేస్తే దౌత్య పరమైన, వాణిజ్య పరమైన ఆంక్షలను విధించవచ్చు. అసలు దొంగలు వాళ్ళా, వివిధ పత్రికలచే నపుంసకులని కీర్తినందుకున్న మనమా అర్థం కావడంలేదు.

గమనిక:

సదరు దొంగలకి మన మద్ధతు ఎల్లప్పుడూ వుంటుంది - ఈ విధంగా:

ముంబై పోలీసు అత్యుత్సాహం: ముంబై దాడుల్లో అసువులు బాసిన తీవ్రవాద సోదరుల దుప్పట్లు, దుస్తులు, ఇతర సామాగ్రి వేలం వేస్తారట! రెండు, మూడేళ్ళ క్రితం హమాస్, వారి తీవ్ర వాద కార్యకలాపాల కోసం వేలం ద్వారా డబ్బు సమీకరించినట్టు.


మదర్సాలకి పోషణ: మధ్యాహ్న భోజనం, పుస్తకాలు వగైరాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రోత్సహిస్తారట. హైదరాబాద్ లో మదర్సాల్లోనే సంఘవిద్రోహుల్ని తయారుచేసే శిక్షణ లభిస్తుందని చిన్న పిల్లలకి
కూడా తెలుసు.


షారుక్ ఖాన్, మరి ఇద్దరి ప్రముఖుల సలహాలు: ఆ తారలకి పాకిస్తాన్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ పోగొట్టుకోడమెందుకు అనుకున్నారేమో తొందరపడి దొంగల ముఠాని ఏమీ అనొద్దు అని ఉచిత సలహా పారేసారు.


అపకారికి ఉపకారం: గాంధీ గారి బాటలోనే దొరికి పోయిన వాణ్ని ఏమీ అనొద్దు అని హేమంత్ ఖర్కారే గారి సతీమణి సెలవిచ్చారు.

కొసమెరుపు:

ఈగోలంతా మనకేందుకనుకున్నారేమో మన డైనమిక్ త్రివిధదళాధిపతి ప్రతిభా పాటిల్ గారు శీతాకాల విడుదులు, దైవ దర్శనాలు, ఇతరత్రా "ముఖ్య" పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారు.

17, జనవరి 2009, శనివారం

తెలుగుని బతికించే మాధ్యమానికి మాయరోగం!

అరువు సన్నివేశాలు, పొంతనలేని పాటలు, విషయంలేని కథనంతో నూటికొక్క సక్సెస్ తో ఉసూరుమంటున్న మన సినిమా ఒకందుకు గర్వపడాలి. ఈరోజుల్లో ఎవ్వరికీ పట్టని తెలుగుని ఏదో ఒక రకంగా బతికిస్తున్నందుకు. దాని చుట్టూనే FMలు, టీవీలు, మన పండుగలు, పబ్బాలు పరిభ్రమిస్తున్నాయి. రోజంతా కాన్వెంట్లోనూ, తల్లితండ్రుల ఫ్యాషన్ ఇంగ్లీషుతో, కాకుంటే కాలేజీలో, MNCల్లో ఆంగ్లం మాట్లాడుతూ తరించే పిల్లా, పెద్దా సినీ కార్యక్రమాలు, సినిమాలూ చూసి కాసేపు తెలుగుతో పరచయం పెంచుకుంటారు. వచ్చీ రాని తెలుగు మాట్లాడే హీరోయిన్లు, కొన్ని శాల్తీలు మినహాయింపులెండి!


ఇప్పుడా సినిమాకి యాసలు, మాండలికాల గొడవొచ్చిపడింది. అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశ్యంతో ముద్రణ, సినిమాల్లో ప్రామాణికంగా ఒక తెలుగు నుడికారాన్ని గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నాం. అయితే తెలంగాణ యాసని కమేడియన్స్కి, విలన్స్కి తెలుగు సినిమాలల్లో ఎక్కువగా వాడుతున్నారని ఒక వాదం. దానికి తోడు, స్థానిక వృత్తుల్ని కూడా ఆపాదిస్తున్నారు. ఉదాహరణకి తెలంగాణా యాదవుల్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని నంది అవార్డుల సందర్భంగా కొందరు ఓ సినిమాలో ఝాన్సీ పోషించిన పాత్రని ఎంపిక చేయడాన్ని నిరసించారు. హీరోలకి మాత్రం నేటివిటీ తో పని లేకుండా, కథతో సంబంధం లేకుండా ప్రామాణిక తెలుగుని వాడడాన్ని తప్పు పడుతున్నారు.
ఇది ఆలోచించాల్సిన విషయమే. అయితే కథ అన్నాక కథానాయకులుంటారు. వారి మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. ఇతర చిన్నా చితకా పాత్రలతో పోలిస్తే వారి మాటలు రాయలసీమ, కోనసీమ, శ్రీకాకుళం తదితర ప్రేక్షకులందరికీ అర్థం కావాలి. కథల్లో పాత్రలకి వేర్వేరు వ్రుత్తులుంటాయి. వారి భాష వారి వ్యవహారాన్ని ప్రతిబింబిస్తుంటుంది.

ముఠామేస్త్రి సినిమాలో పరుచూరికిచ్చిన యాదవ్ పాత్ర వినోదాత్మకంగా ఉండడమేకాక ఆ వృత్తికి వన్నె తెచ్చేదిగా వుంటుంది. సముద్రం సినిమాలో తనికెళ్ళ పోషించిన విశాఖ ప్రాంతానికి చెందిన బెస్తవాడయిన విలన్ పాత్ర కూడా అంతే.
వారి పాత్ర ఔచిత్యాన్ని, సందర్భాన్ని బట్టి సహజత్వం కోసం మాండలికాన్ని ఉపయోగించడంలో తప్పు లేదు. కాని కించ పరిచే విధంగా, ఒక ప్రాంతం వారిని తక్కువచేసేలా చూపించడం గర్హించదగినదే.


మాండలికాల పై ఎక్కువ దృష్టి పెట్టి ప్రతిదీ వివాదాస్పదం చేస్తే ఇక కళాకారులకు స్వేచ్చ వుండదు. పత్రికలూ, స్కూలు పుస్తాకాలు, ప్రభుత్వ సమాచారం వారి వారి మాండలికంలో ముద్రించబడాలనే కొత్త వాదం పుట్టుకొస్తుంది.


మూలిగే నక్కపై తాటి పండు అన్నట్టు అసలు తెలుగు ఉనికికే ప్రమాదమొచ్చి పడిందిరా అంటే ఆ తెలుగు, ఈ తెలుగు అంటూ కొట్టుకోవడం ఎంతవరకు సబబు?

14, జనవరి 2009, బుధవారం

మొద్దు శీనుపై ఉన్న శ్రద్ధ మామూలు మనిషి పై లేదేమి?

"మానవ హక్కులు"అనే డొక్కు మాటను పలికే బదులు మన హక్కులు అని కాసేపు మాట్లాడుకుంటే సరిపోతుందేమో! చట్టాన్ని అమలుపరిచే వారు తమ భాద్యతలని విస్మరించినపుడో లేదా అత్యుత్సాహం ప్రదర్శించినపుడో మనవ హక్కులంటూ ఒకట్రెండు రోజులు హడావిడి చేసి డిసంబరు 10న ఉత్సవాలు చేసుకుంటూ వుంటారు. మంచిదే! కానీ వాళ్ల పోరాటం కొద్ది మంది కోసమే ఎందుకు పరితమవుతోంది? అధిక సంఖ్యలో ఉన్నసామాన్య ప్రజానీకం యొక్క హక్కుల పరిరక్షణ వారి దృష్టిలో ఎందుకు లేదు?

అందుకే కాసేపు మన హక్కుల గురించి మనమే ప్రశ్నిద్దాం. స్వచ్చమైన గాలి, భూగర్భ జలాలు మరియు వనరులు, రోజువారి పనుల కోసం పబ్లిక్ స్థలాల్లో తిరిగే స్వేచ్చ కూడా ఇప్పుడు సన్నగిల్లిపోతున్నాయి.

మొద్దు శీనుపై ఉన్న శ్రద్ధ పాపం హక్కుల సంఘాల వారికి మామూలు మనిషి పై లేదు. ఉన్నత స్థాయి సమావేశాలు, మేధావుల సదస్సులంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే వారి ఆసక్తికి మనం కారణం కాలేనపుడు, అంతర్గత భద్రత, కనీస హక్కుల కోసం మనమే ఒక యంత్రాంగాన్ని ఏర్పరచుకోవడం ఇప్పుడు ఎంతైనా అవసరం.

ఈ ప్రయత్నంలో ఇప్పటికే పనిచేస్తున్న సంస్థలకు నావంతు సహకారన్నందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆలోచనాపరులు, ఆచరణశీలురందరూ తమ అభిప్రాయలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను.

12, జనవరి 2009, సోమవారం

మూణ్నాళ్ళ ముచ్చట

దేశంలో నెలకో బాంబు ఇప్పుడు సహజం అయిపొయింది. అది జరగకపోతే వింత అన్నట్టుంది పరిస్థితి. ఇక భాగ్యనగరంలో ఇవాళో రేపో ఎక్కడో ఒక చోట ఉగ్రవాదులు పంజా విసురుతారని కొత్త సంవత్సరం ముందు నుంచి అనుకుంటున్నారు. ఒక పక్క సంక్రాంతి! పెద్ద పండుగ. ఎంత పెద్ద పండుగ అంటే పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ఊర్లకి తరలి వెళ్ళడం వల్ల నగరం దాదాపు ఖాళీ అయ్యేంత.

అందులో కృష్ణ, గోదావరి, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాలకి వెళ్లేవారు ఎక్కువ. వీరందరికీ బస్సు ప్రధాన రవాణా సదుపాయం. మన ఆర్టీసీ వాళ్లు స్పెషల్ బస్సులు కూడా వేశారాయే! ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ బస్ స్టేషన్ లో భద్రత అత్యంత పేలవంగా వుంది. మన వాళ్ళకేమీ కాలేదు అన్నంత వరకు మనం ఇలా నిబ్బరంగానే తిరుగుతుంటాము. ఏదైనా జరిగితే సోనియా, మన్మోహన్ గార్లు పరామర్శించడానికి రానే వస్తారు.

కూడలి

కూడలి

10, జనవరి 2009, శనివారం

పదేళ్ళ క్రితం జరగాల్సిన పరిణయం!

మళ్ళీ కృష్ణవంశి మూవీ వచ్చింది... శశిరేఖ పరిణయం. టైటిల్ చూసి చెప్పొచ్చు, మరో బంధుమిత్రుల హంగామా అని. చిత్రం చూసి చెప్పొచ్చు ఇది 2009 లో రావాల్సినది కాదని. నిన్నే పెళ్ళాడుతా, అనగనగా ఒక రోజు వంటి చిత్రాలు వచ్చిన 90ల నాటి కథ, కథనంతో మరో హిట్ కొట్టకపోతానా అని విడుదల చేసేసాడు.

అనుకోకుండా జరిగే సంఘటనలతో పెళ్లికి ముందే హీరో, హీరోయిన్లు ఎలా దగ్గరవుతారు, పెళ్లితంతు కూడా వాళ్ళకి తెలియకుండానే యాదృచ్చికంగా ఎలా ముగుస్తుందనేది ఒకటికి రెండు సార్లు చూపిస్తాడు. సీతారాముల కళ్యాణం పాటతో మొదలయిన సినిమా తరుణ్, జెనీలియాల పెళ్లి సీన్ తో ముగుస్తుంది. మధ్యలో అంతా ఉరుకులు, పరుగులు, అపార్థాలు, అలకలు, ప్రమాదాలు, ఈ గొడవలో అంతర్లీనంగా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లికి తగ్గట్టుగా వారు ఎలా ఒకటయ్యారు అనేది కృష్ణవంశి చెప్పాలనుకున్న విషయం. కానీ అదేంటో, ఏ సన్నివేశం చూసినా ఇంతకుముందు ఏదో సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది.

ఉన్న ఒక్క మెలోడీని బట్టల షాప్ లో (విజయవాడ-మాన్య) తీసి మమః అనిపించాడు. ఆ దుకాణం వాళ్ల ఫోటోషూట్, వీరి పాట చిత్రీకరణ ఒకేసారి జరిగినట్టుంది (ఇప్పుడు టీవీల్లో వచ్చే యాడ్స్ చూస్తే తేలుస్తుంది). మొత్తానికి ఈ టింగిరి, బుచ్చమ్మల (సినిమాలో హీరో, హీరోయిన్ల ముద్దు పేర్లు) పెళ్లి ఎప్పుడో అవ్వాల్సిందని అనిపిస్తుంది.

ఓ మాట

మిత్రులారా, కొన్ని అనివార్య కారణాల వల్ల పాత పోస్ట్ లను తొలగించాను.
ఇప్పటి నుంచి పోస్ట్ చేసేవి అందుబాటులో ఉంటాయని మనవి.


- మీ విశ్వామిత్ర